శుభ్రత లేని పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు సోమవారం నగరంలోని పలు బేకరీలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో ఆహార తయారీ ప్రదేశాల్లో పరిశుభ్రత, నిబంధనల అమలును పరిశీలించారు. నిబంధనలు పాటించని దసరా దావత్ కిచెన్, అన్లిమిటెడ్, బేకర్స్ డిలైట్ షాపులకు ఒక్కొక్కదానికి రూ.2,000 చొప్పున జరిమానా విధించారు. భవిష్యత్తులో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీల్లో నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్, నాగభూషణం, వార్డు ఆఫీసర్ రామకృష్ణ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments 0