గోదావరిఖని: పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్‌డివిజన్ పరిధిలోని విద్యాసంస్థల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లకు ఎన్‌టీపీసీ మిలీనియం హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలు అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని సూచించారు. విద్యార్థులను ఎక్కించే, దించే సమయంలో నిర్దేశించిన ప్రదేశాల్లోనే బస్సులను నిలిపివేయాలని తెలిపారు. డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడపరాదని, ఓవర్‌టేకింగ్‌కు పాల్పడకూడదని హెచ్చరించారు. మద్యం సేవించి లేదా సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగే ఘటనలకు సంబంధిత పాఠశాల లేదా కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ కృష్ణకుమార్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రెడ్డి, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, ముత్తారం ఎస్‌ఐ రవికుమార్, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.