కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఆర్పీలు సమన్వయంతో పని చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేయాలని రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4, 24 నుంచి 34వ డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి వార్డు సభను సోమవారం ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వార్డు బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సెల్ఫోన్ వినియోగం వల్ల పిల్లలు చెడు అలవాట్లకు గురికాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. కాలువల పూడిక తొలగింపు, రోడ్ల గుంతల పూడ్చివేత, నీటి నిల్వలు నివారణ, శిథిల భవనాల తొలగింపు, పైప్లైన్ లీకేజీల మరమ్మతులు వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు పరిశుభ్రత పాటించి కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ ముడుత రమేష్ ట్రాఫిక్ నిబంధనలు, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఎంఆర్వో రవీందర్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి అతుల్య అంటువ్యాధుల నివారణ చర్యలపై, ఐసీడీఎస్ సీడీపీవో ఆలేఖ్య పటేల్ అంగన్వాడీ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఏసీపీ శ్రీహరి, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, కీలక కూడళ్లు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన కమిషనర్, పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
రామగుండం నగర పాలక సంస్థలో శనివారం పదవీ విరమణ పొందిన సూపరింటెండింగ్ ఇంజినీర్ గురువీర, పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఈదునూరి పోషం, కాదాసు రాజయ్య, తిప్పారపు ఐలయ్యలకు ఘనంగా సన్మానం నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్ జె. అరుణ శ్రీ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఉద్యోగులు తమ విధుల్లో నిబద్ధతతో పనిచేసి నగర అభివృద్ధికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. వారి సేవలను నగర పాలక సంస్థ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ మహంకాళి స్వామి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బట్టలను పంపిణీ చేశారు. కొప్పుల శంకర్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కైండ్స్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తబిత అనాథ ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. రామగుండం ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ సంస్థ పోస్టర్ను ఆవిష్కరించి విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథ పిల్లల విద్యాభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో దయానంద్ గాంధీ, నంది మేడారం స్కూల్ ప్రిన్సిపాల్ పద్మ, ఫౌండేషన్ డైరెక్టర్లు సుంచురి రాజశేఖర్, మిట్టపల్లి లిటిల్, గుంటి రవికుమార్, గజ్జల ప్రవీణ్, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలానికి ముందే వరద ముప్పును నివారించేందుకు కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణ శ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పి.కె. రామయ్య కాలనీలో కాలువల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, రహదారుల విస్తరణ పనులను పరిశీలించారు. మేయర్ ఆదేశాల మేరకు జేసీబీలు, ట్రాక్టర్లు, జెట్టింగ్ యంత్రాలతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించారు. భూగర్భ జలాల పెంపు కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతల ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అవసరమైతే 1వ డివిజన్లో మరికొన్ని రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళ బాపు, ఎస్ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమం మరియు విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం “ముందడుగు” అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ వెల్ఫేర్ యూనియన్ను ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ముఖ్య బాధ్యుల సమావేశంలో యూనియన్ను అధికారికంగా ఆవిర్భావం చేశారు.యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ముఖ్య సలహాదారుగా మేయర్ మహంకాళి స్వామిని ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా రాకం శారద, సింగంశెట్టి రజిత, కొట్టూరి నర్మద తదితరులను ఎంపిక చేశారు. ఐక్యతతో అంగన్వాడీ సిబ్బంది హక్కుల సాధన కోసం పనిచేస్తామని నాయకులు తెలిపారు.
రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి వరద కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, రూ.4 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న ఈ పనులు త్వరగా పూర్తైతే వర్షాకాలంలో వరద ముంపు సమస్య ఉండదన్నారు. శనివారం నుంచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్లూరి రవి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మున్సిపాలిటిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది ఎక్కడ చూసినా చెత్త కుప్పల దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో గుట్టలుగా పేరుకు పోయింది. రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడంలేదని, వాహనం మరమ్మత్తు కొస్తే వారం పది రోజుల వరకు చెత్త సేకరించె నాధుడే కనిపించారు.ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. దీంతో కొన్ని ప్రాంతంలో ఇంటిలో చెత్త నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. కాలనీలలో స్వచ్ఛ ఆటోలు రావడంలేదని నూతన పాలకవర్గం స్పందించి కాలనీలో రోజు చెత్త సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టులో ప్రతీ పౌర్ణమి రోజున నిర్వహించే 40వ గిరిప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో 2023 ఫిబ్రవరి 5న మాఘ పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక గిరిప్రదక్షిణ పాదయాత్ర నిరాటకంగా కొనసాగుతోంది. శుక్రవారం సందర్భంగా నిర్వహించిన 40 వ గిరిప్రదక్షిణను శ్రీశ్రీశ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ గారు ఉదయం 5.30 గంటలకు ప్రారంబించారు. ఈ సందర్బంగా మహారాజ్ మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటలకే భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారని, హిందువులు వారి జాగ్రత్త భవిష్యత్తు తరాల రక్షణ, ధర్మపరిరక్షణ కోసమే కలిసి ఒకటిగా నడుస్తున్నారని, దీనితో సనాతన ధర్మానికి, దేశానికి, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని, హిందువుల కులాలకు, రాజకీయాలకు ఆతీతంగా ఐక్యత తో ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. అనంతశక్తిశాలి అయిన శ్రీఆంజనేయ స్వామి కృప భక్తులపై ఎల్లప్పుడూ ఉండి, వారిలో ఆవహించి దేశరక్షణతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ గావించాలని కోరారు. ఈ కార్యక్రమం లో వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.