రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధిలోని జనగామ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రుల సహకారంతో 45 మంది విద్యార్థులకు విద్యా సంవత్సరానికి అవసరమైన నోట్బుక్స్, పెన్నులు, పలకలు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ శ్యామని రమేష్ మాట్లాడుతూ, "ప్రైవేట్ వద్దు – ప్రభుత్వం ముద్దు" అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాలమైన ఆట స్థలాలు, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు నోట్బుక్స్ అందించడంలో సహకరించిన రుద్రభట్ల పవన్ శర్మ, రుద్రభట్ల నిఖిల్ శర్మ, జువ్వాడి విజయ్రావులకు కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నడిపెల్లి గోపాల్రావు, బొమ్మెర అమరేందర్, తంగేడా నరేందర్రావు, అరెళ్ల రవితేజ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, మున్సిపల్ వార్డు ఆఫీసర్ చిలుముల ఐల్లయ్య, రవీందర్, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments 0