వర్షాకాలంలో అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 46వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..., పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో లేదా కాలువల్లో వేయకుండా నగర పాలక సంస్థ చెత్త వాహనాలకు అందించాలని కోరారు. అనంతరం సంజయ్ గాంధీ నగర్ ప్రధాన రోడ్డులో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలను తొలగించారు. నాలాలపై ఉన్న అడ్డంకులను తొలగించి పూడిక తీయడంతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు నవీన్, మీర్, పబ్బాల శ్రీనివాస్, సంపత్, చంద్రారెడ్డి, మెప్మా సీఓ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

Comments 0