విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్/జూనియర్ కాలేజీ (బాలికలు) పాఠశాలను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, అక్కడ అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులను పరిశీలించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వంటశాలను పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆహార పదార్థాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిల్వ చేయాలని, విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ధర్మారం ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు, కార్యాలయ పనితీరును పరిశీలించారు. పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం తహసిల్దార్ శ్రీనివాస్, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్సిపాల్ పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.