రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనులు పూర్తయిన వెంటనే సైట్ క్లియర్ చేసి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి లేకుండా పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అన్నారు. సరైన కారణాలు లేకుండా పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నగర పాలక సంస్థ ఏఈలు తేజస్విని, మనోజ్, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు