|
modi add 1

సమన్వయంతో పని చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి: డిప్యూటీ మేయర్ ఎల్లయ్య

కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఆర్‌పీలు సమన్వయంతో పని చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేయాలని రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4, 24 నుంచి 34వ డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి వార్డు సభను సోమవారం ఎన్‌టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వార్డు బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వినియోగం వల్ల పిల్లలు చెడు అలవాట్లకు గురికాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. కాలువల పూడిక తొలగింపు, రోడ్ల గుంతల పూడ్చివేత, నీటి నిల్వలు నివారణ, శిథిల భవనాల తొలగింపు, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు పరిశుభ్రత పాటించి కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ ముడుత రమేష్ ట్రాఫిక్ నిబంధనలు, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఎంఆర్వో రవీందర్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి అతుల్య అంటువ్యాధుల నివారణ చర్యలపై, ఐసీడీఎస్ సీడీపీవో ఆలేఖ్య పటేల్ అంగన్‌వాడీ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఏసీపీ శ్రీహరి, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

By Ambati Sathish kumar | June 08, 2026 | 0 Comments

Hot Categories

2
7
1